కవితక్క గర్జనతో దిగివచ్చిన సర్కార్:
రంగారెడ్డి ,అక్షిత మీడియా;-
తెలంగాణ జాగృతి పోరాట పటిమకు నిదర్శనం.
ఉద్యమకారుల పక్షాన కవితక్క ఉంటే.. కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?
రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండురంగారెడ్డి సూటి ప్రశ్న.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సాగుతున్న పోరాటం సత్ఫలితాలను ఇచ్చిందని, ఇది తెలంగాణ జాగృతి పోరాట పటిమకు దక్కిన విజయమని తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండురంగారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేఖరులకు అందజేసిన ఒక ప్రకటనలో ఆయన ప్రస్తుత రాజకీయ పరిణామాలు మరియు ఉద్యమకారుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరును వివరించారు.
జై తెలంగాణ.. అని గర్జించిన ఆ ఉద్యమ గొంతుకలు పునరాలోచనలో పడ్డాయి. స్వరాష్ట్ర సాధనతో సంబురపడ్డ ఆ గుండెలకు పుష్కర కాలమైనా ఆశించిన ఆత్మగౌరవం దక్కక అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్ర కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పాండురంగారెడ్డి స్పష్టం చేశారు. "ఉద్యమకారుల సమస్యలను గాలికొదిలేస్తే బంగ్లా బయటకు గుంజుతారు" అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన శక్తివంతమైన హెచ్చరికతోనే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందని ఆయన అన్నారు. ఈ ఒత్తిడి ఫలితంగానే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా వచ్చి ఉద్యమకారుల సమస్యలను వినడం, వారికి తక్షణమే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.
ఇదే సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ వైఖరిని పాండురంగారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఒకవైపు కవితక్క ఉద్యమకారుల కోసం అలుపెరగని పోరాటం చేస్తుంటే, మరోవైపు కేటీఆర్ ఉద్యమకారుల విషయంలో కనీసం నోరు మెదపకపోవడం విస్మయం కలిగిస్తోందని అన్నారు.
"అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేసి, అసలైన ఉద్యమకారుల ఉనికి లేకుండా చేశామన్న అపరాధ భావనతోనే కేటీఆర్ ముఖం చాటేస్తున్నారా? లేక తన తప్పును ఇంకా తెలుసుకోలేదా?" అని తెలంగాణ సమాజం తరపున ఆయన సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమకారులకు ఏ కష్టం వచ్చినా, వారి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లినా కవితక్క ఎల్లప్పుడూ ముందు వరుసలో నిలబడి పోరాడుతారని ఈ పరిణామం మరోసారి రుజువు చేసిందని పాండురంగారెడ్డి అన్నారు. ఉద్యమకారుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు తెలంగాణ జాగృతి విశ్రమించదని ఆయన స్పష్టం చేశారు.
ధన్యవాదములతో..👏

0 కామెంట్లు