*అభివృద్ధి పేరుతో నిర్లక్ష్యమా, లేక దళితులు అనే చిన్నచూపా*
కడప జిల్లా, అక్షిత మీడియా;-
మైదుకూరు నియోజకవర్గం, చాపాడు మండలం, ఎన్ ఓబాయపల్లె పంచాయతీకి చెందిన తిప్పిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీ మహిళలు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని అధికారులపై, ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాలనీలో ఉన్న రహదారిని పగలగొట్టి నెలలు గడిచినా ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టకపోవడంపై మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పలుమార్లు సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకపోవడంపై వారు ప్రశ్నల వర్షం కురిపించారు.
“ఎన్నికల సమయంలో మా ఇళ్ల ముందుకు వచ్చి ఓట్లు అడిగే మీరు, ఇప్పుడు మా కాలనీలోకి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారా? మా ఓట్లు మాత్రమే అవసరమా? మా పిల్లలు బురదలో నడుచుకుంటూ స్కూల్కి వెళ్లడం మీకు కనిపించడంలేదా? వర్షం పడితే మేము బయటకు రావడానికి కూడా వీలు లేకుండా పోతున్న పరిస్థితి మీకు తెలియదా అదేవిధంగా దారికి పక్కన రైతులు పండించే పొలంలో నీరు కూడా రావటంతో ఇబ్బంది పడుతున్నాము అంటూ మహిళలు నిలదీశారు.
“రోడ్డు పగలగొట్టినప్పుడు పనులు త్వరగా పూర్తి చేస్తామని చెప్పిన హామీలు ఎక్కడికి పోయాయి? మేము పేదవాళ్లమని మా సమస్యలకు విలువ లేదా? ఎస్సీ కాలనీ కాబట్టే మా బాధలను నిర్లక్ష్యం చేస్తున్నారా?” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రహదారి పూర్తిగా దెబ్బతిని చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మహిళలు తెలిపారు. వర్షాకాలం సమీపిస్తుండగా పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇకనైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణ చర్యలు తీసుకుని రహదారి మరమ్మతులు పూర్తి చేసి కాలనీ ప్రజల సమస్యలను పరిష్కరించాలని మహిళలు గట్టిగా డిమాండ్ చేశారు

0 కామెంట్లు