నిరుద్యోగులను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రాకేష్





నిరుద్యోగులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు*

 *పి వై ఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వీ. రాకేష్*

ఖమ్మం, అక్షిత మీడియా;-


*కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను నట్టేట ముంచుతున్నాయని ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వీ. రాకేష్ ధ్వజమెత్తారు. ఆదివారం ఖమ్మంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో పి వై ఎల్ జిల్లా అధ్యక్షుడు జాటోత్ ప్రేమ్ సింగ్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి ఎన్ వి రాకేష్ హాజరై మాట్లాడారు.*

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడది లోపే 1.90 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, నేడు కనీసం నిరుద్యోగుల వైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ అమలుకు నోచుకోలేదని, నిరుద్యోగ భృతి ఊసే లేదని మండిపడ్డారు. ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల చుట్టూ తిరుగుతూ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఉన్న యువత, నోటిఫికేషన్లు లేక తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, నేడు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. కులం, మతం పేరుతో విద్యార్థులను, యువకులను పక్కదారి పట్టిస్తూ అసలు సమస్యలను విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. పీజీలు, పీహెచ్‌డీలు పూర్తి చేసిన వారు కూడా ఉపాధి లేక డిగ్రీ పట్టాలతో రోడ్ల పైన తిరుగుతున్న పరిస్థితి దేశంలో నెలకొందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆర్భాటంగా రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రకటించిందని, దీని కింద 5 లక్షల మందికి ₹3 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని ఆశ చూపిందని గుర్తు చేశారు. అయితే, దరఖాస్తులు చేసుకుని ఏడాది గడుస్తున్నా, నేటికీ చాలా మంది అర్హులకు రుణాలు అందలేదని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి అన్ని ఖాళీలకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.రాజీవ్ యువ వికాస పథకాన్ని తక్షణమే అర్హులకు అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని, నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించకుంటే, ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఎన్.వీ. రాకేష్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి జిక్కుల భరత్, ఉపాధ్యక్షులు సిహెచ్ ధరణి కృష్ణ నాయకులు గోడ్డెటి అశోక్ ఇస్లావత్ రమేష్ మామిడాల వెంకటేష్ కొత్త రమేష్ మాలాది వెంకటేష్ పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు